జనవరి 15న విడుదలకు ముస్తాబవుతున్న ‘ఎంత మంచివాడవురా’

నందమూరి కళ్యాణ్రామ్, మెహరీన్ జంటగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమా చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘శతమానం భవతి’ చిత్రంతో జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న సతీష్ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని పాటలను డిసెంబరులో విడుదల చేయనున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాటలకు ఎంతో ప్రాధాన్యముండేలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరకల్పన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాట, రామజోగయ్య శాస్త్రి రెండు పాటలు, శ్రీమణి ఒక పాట రాశారు. ఇందులో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయని దర్శకుడు సతీష్ వేగేశ్న తెలిపారు. క్లైమాక్స్లో వచ్చే ఫైట్ను ఖర్చుకు వెనుకాడకుండా చాలా రిచ్గా తీశామని, గోదావరి నదిలో సాహసోపేతంగా చిత్రీకరించిన ఈ సన్నివేశాల విషయంలో ఫైట్ మాస్టర్ వెంకట్ రిస్క్ తీసుకున్నారని వివరించారు.
నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ.. సినిమా చిత్రీకరణ కారక్రమాలు పూర్తయ్యాయని, జనవరి 15న విడుదల చేయనున్నామని చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయన్నారు. టీజర్కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఆఖరి షెడ్యూల్ కేరళలోని మున్నార్ తదితర సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఆడియో రంగంలో మా సంస్థ ఎలా దూసుకు పోయిందో చిత్ర నిర్మాణ రంగంలోనూ ఆ ఒరవడిని కొనసాగిస్తుంది. డిసెంబరు1 నుంచి రీరికార్డింగ్ ప్రారంభమవుతుంది” అని వివరించారు. చిత్ర సమర్పకులు శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ”అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఈ చిత్రం రంజింపజేస్తుంది. చాలా సంతృప్తికరంగా అవుట్ పుట్ వచ్చింది. డిసెంబరులో పాటలను విడుదల చేస్తాం” అని వివరించారు.
ఇంకా వి.కె.నరేశ్, సుహాసిని, శరత్బాబు, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెలకిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటించారు.